యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం.
- metiamaraavathi
- Mar 31
- 1 min read
ఎంపీ సానా సతీష్ బాబు..

డిల్లీ, మార్చి 30 (మేటి అమరావతి) ఆంధ్రప్రదేశ్ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ముందడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 60,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం అమలుపై రాజ్యసభలో ఆయన గళమెత్తారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు మరియు శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయాలని సానా సతీష్ బాబు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను కోరారు. ఎంపీ చొరవతో ప్రస్తుతం అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ, పెద్దాపురం, భీమవరం, సామర్లకోట క్లస్టర్ల అభివృద్ధిపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాంతాల్లో ఎంఎస్ఇ-సిడిపి ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు మెరుగైన శిక్షణ అందించి, వారిని పారిశ్రామిక రంగానికి సిద్ధం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. తణుకులో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పనులు పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయి. కాకినాడ నియోజకవర్గ యువతకు మెరుగైన భవిష్యత్తును అందించడమే తన లక్ష్యమని, వారికి కేవలం ఉద్యోగాలే కాకుండా స్వయం ఉపాధి పొందేలా నైపుణ్యం అందించేందుకు కట్టుబడి ఉన్నామని సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. ఎంపీ సానా సతీష్ బాబు తీసుకుంటున్న ఈ చర్యల వల్ల రాష్ట్రంలోని పారిశ్రామిక ముఖచిత్రం మారడమే కాకుండా, వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు సుగమం కానున్నాయి.




Comments